ఉత్తరీశాన్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన  దివ్యఫలకము (#13724)

[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన తొమ్మిది ఉత్తరీశాన్య రాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 26 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.] 
 ఓ స్వర్గదూతలారా!  
నౌరూజ్ పర్వదినములివి. సహృదయులైన ఆ మిత్రులను గురించి సదా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అమెరికన్ రిపబ్లిక్కులలో జరుగుతున్న ఆ సమావేశాలు - హృదయాలలో భగవంతుని ప్రేమజ్యోతి తేజరిల్లేలా, మైనపువత్తులవలె ప్రజ్జ్వలించి, దివ్యబోధనాకిరణములు ఆ విధముగా అమెరికన్ రాష్ట్రాలను మహత్తర మార్గదర్శకత్వ తారాసమన్వితమైన సువిస్తృతాంతరిక్షము వలె రత్నాలంకృతను, శోభాసమన్వితను గావింపవలెనని - మీలో ప్రతి ఒక్కరి నిమిత్తమూ ఏకత్వద్వారసీమ నుండి అనుగ్రహ, సహకారముల నర్థిస్తున్నాను.    
అట్లాంటిక్ తీరంలోని ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, న్యూ హ్యాంప్షర్, మసచుసెట్స్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్. ఈ రాష్ట్రములలోని కొన్నింటిలో విశ్వాసులున్నారు, అయితే, ఈ రాష్ట్రముల నగరములలో కొన్ని, ఇంకనూ దివ్యసామ్రాజ్యప్రభలతో శోభిల్లనూ లేదు, దివ్యబోధనల నెఱుగనూ లేదు. అందువల్ల, మీలోని ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడల్లా ఆ నగరములకు త్వరత్వరగా తరలి, మహత్తర మార్గదర్శకత్వ తేజోసమన్వితులై తారల వలె ప్రకాశింపవలె. భగవంతుడు ఖురాన్‌లో ఇలా ప్రవచించినాడు:“భూమి నల్లని బీడుగా వుండేది. మే మప్పుడు దానిపై వర్షమును కురియింపచేయగా, తక్షణమే అది హరితము, సస్యశ్యామలము అయినది, సర్వవిధములైన మొక్కలూ సమృద్ధిగా మొలకెత్తినవి.”1 వేరొక విధముగా చెప్పవలెనంటే, నేల నల్లనిదనీ, వసంత కాలపు వర్షపుజల్లులు తనపై వర్షించినప్పు డది సచేతనమైనదనీ, వివిధవర్ణముల పుష్పములూ వికసించాయనీ అంటున్నా డాయన. ప్రాకృత్రిక ప్రపంచమందలి మానవ హృదయాలు మట్టివలె నల్లనివని దీనికి అర్థం. అయితే, దివ్యత్వవాహినులు భువికి దిగివచ్చి, సముజ్జ్వల ప్రభలు సాక్షాత్కరించినప్పుడు హృదయములు పునరుజ్జీవనము నొందుతాయి, ప్రకృతి అనబడే అంధకారము నుండి విముక్తినొందుతాయి, దివ్యమహిమాన్విత కుసుమములు వృద్ధిచెంది, సమృద్ధతను సంతరించుకుంటాయి. పర్యవసానముగా, మానవుడు మనుష్యప్రపంచమునకు చైతన్య కారకుడై, దైవస్ఫూర్తితో పావనగ్రంథావిష్కృత పవిత్రబోధనలను పరివ్యాప్తము సేయుచూ ఉండవలె. మీరు తూర్పు, పడమరలకు పయనించి, మహత్తర మార్గదర్శకత్వకాంతితో ప్రజలను జ్ఞానవంతులను గావింపుడు, తద్వారా, వారు అమరజీవితమునం దొక పాలు నొందెద,2 రని పవిత్ర సువార్తలో ప్రస్తావితమైనది. ఉత్తరీశాన్యరాష్ట్రములు అపార సామర్థ్యమును సంతరించుకొని నందులకు భగవంతుడు శ్లాఘనీయుడు. ఏలయన, భూమి సారవంతము; దివ్యజలధార వర్షిస్తున్నది. మీ రిప్పుడు దివ్యహాలికులై, సిద్ధము సేయబడిన నేలలో స్వచ్ఛబీజములను చల్లవలె. ప్రతి విత్తనపు దిగుబడీ పరిమితమే, అయినను, దివ్యబోధనా బీజముల అనుగ్రహాశీస్సు లపరిమితములు. రానున్న శతాబ్దిలో, కాలావృత్తమునం దింకెన్నియో పంటదిగుబడుల సమీకరణము జరుగ గలదు. దీనిని పూర్వతరముల కృషి యని పరిగణింపుడు. యేసుక్రీస్తు జీవిత కాలమునం దాయనను విశ్వసింపుచుండిన స్థిరచిత్తులు లెక్కకు కొందరే అయినను, దైవాశీస్సు లెంత సమృద్ధిగా వర్షించినవనిన, కొద్ది సంవత్సరములలోనే, లెక్కకు మిక్కిలిగ జనులు సువార్తచ్ఛాయలోనికి ప్రవేశించినారు. “ఒక్క గింజ ఏడు కంకుల నిచ్చును, ప్రతి కంకియు నూరేసి గింజల నొంది యుండు,”3 నని ఖురాన్‌లో, భగవంతుడు ప్రవచింపనైనది. వేరొక విధముగ చెప్పవలె ననిన, ఒక్కటే ధాన్యపుగింజ ఏడువందల గింజలగును; భగవంతుడు తలచుకొనినచో, వాటిని రెండింతలైనను చేయగలడు. ధన్యజీవి యొక్కడు దేశమునకే మార్గదర్శన హేతువగుట సకృత్తుగా జరుగుతూ వచ్చినదే. మనమిప్పుడు మన శక్తిసామర్ధ్యములను గణనము సేయరాదు; తద్భిన్నముగా, బిందువునుండి అంబుధినీ, అణువునుండి ఆదిత్యుడినీ సృజియించిన భగవంతుని ఉపకృతుల పైనను, అనుగ్రహముల పైనను మన మీనాడు దృష్టిని కేంద్రీకరింపవలె. 
మీకు ప్రశంసాభినందనలు!

-`Abdu'l-Bahá
-----------------------

ఉత్తరీశాన్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన  దివ్యఫలకము (#13730)

[యునైటెడ్ స్టేట్స్ లోని తొమ్మిది ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసు లైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 2న హైఫాలో, అబ్దుల్-బహా నివాసంలోని ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.] 
 
ఆయన భగవంతుడు! 
ఓ నిజ మిత్రులారా: 
 
నిజైకదైవ దృష్టిలో దేశములన్నియూ ఒక్కటే దేశము, సకల నగరములదీ, గ్రామములదీ ఒకే ప్రాతిపదిక. ఏదియూ ఇంకొకదానిని మించిన విశిష్టత నొంది యుండలేదు. అవన్నియూ దైవక్షేత్రములే, జనావాసములే. అయితే, విశ్వాసముతో, దృఢనిశ్చయముతో, ఒకరిపై ఒకరు సాధించిన ప్రాధాన్యతతో, నివాసి - ఆవాసమునకు గౌరవమును చేకూరుస్తాడు. కొన్ని దేశములు విశిష్టతను సంతరించుకుని, ఉదాత్తస్థాయి నందుకుంటాయి. ఉదాహరణకు: యూరోపియన్, అమెరికన్ దేశముల యందలి కొన్ని - పర్యావరణ రమ్యతలోనూ, జలసమృద్ధిలోనూ, పర్వతముల, మైదానముల, పచ్చికబీళ్ల మనోజ్ఞతలోనూ కొన్ని దేశములను అధిగమించినప్పటికీ, పాలస్తీనా మాత్రము - అబ్రహామ్ నాటి నుండి ప్రవక్తల ముద్ర1 అవతరణము వరకూ, పవిత్రావతారములు ఆ దేశమున వసించడమో, అచటకు తరలిపోవడమో, ఆ దేశము ద్వారా పయనించడమో జరిగినందున - దేశములకే తలమానికమైనది. అటులే, ప్రవక్తృత్వ జ్యోతి భాసిల్లినందున మక్కా, మదీనాలు అనంతకీర్తిని సముపార్జించుకొని యున్నవి. ఈ కారణముననే అన్య దేశములకన్ననూ పాలస్తీనా, హిజాజ్ లకు విశిష్టత చేకూరినది. 
ఆ విధముగనే, నిజైక దైవదృష్టిలో అమెరికా ఖండము: ఆయన జ్యోతిర్వైభవ మావిష్కృతము కావలసిన, ఆయన దివ్యధర్మమర్మములు ప్రదర్శితములు కావలసిన, ధర్మవర్తనులు వసింపవలసిన, స్వేచ్ఛాజీవులు సమీకృతులు కావలసిన భూభాగము. అందువలన, అక్కడి ప్రతి ప్రాంతమూ ఆశీఃకృతమైనది; అయితే, విశ్వాస, అభయప్రదానముల పరముగా ఈ తొమ్మిది రాష్ట్రములూ అనుగ్రహీతము లైనందున, తత్ప్రాముఖ్యతతో అవి - ఆధ్యాత్మిక మహద్భాగ్యమునకు పాత్రత నొందినవి. ఈ అనుగ్రహప్రాధాన్యత నవి గ్రహియించి తీరవలె: ఎందులకనగా, అవి అంతటి బహూకృతికి పాత్రమైనవి, ఈ ఘనతరానుగ్రహమునకు ధన్యవాదముల నర్పించుటకై - అవి దివ్యసౌరభముల పరివ్యాపనమున కుద్యమింపవలె. తద్వారా: “స్వర్గమునకూ, భూమికీ జ్యోతి భగవంతుడే: ఆయన జ్యోతి అనురూపత గోడ గూటిలోని దివ్వె; గాజుపేటికలో దాచి ఉంచబడిన దాదీపము; ప్రకాశమయ నక్షత్రము వలె కానవచ్చు నాగాజు. అది ఒక ధన్యవృక్షపు – ప్రాక్పశ్చిమములలో దేనికీ చెందని ఆలివ్ వృక్షపు – తైలముతో ప్రజ్జ్వలితమైనది; అది ఆశించునది అల్పమే, కాని, ఏ అగ్నీ తనను స్పర్శించకున్ననూ ఆ తైలము వెలుగు నిచ్చును. ఈ వెలుగు ఇంకొక తేజముతో మిళితమైనది. భగవంతుడు తన తేజమును తనకు ఇష్టులైనవారి వంకకే ప్రసరించు,”2 నను ఖురాన్ పవిత్రవాక్కులు సాకారము కావచ్చును.
ఇట్లనుచున్నా డాయన: ప్రాకృతిక ప్రపంచ మంధకారమయ ప్రపంచము, ఏల యనగా, సహస్రభ్రష్టత్వములకు మూలమది; అంతియకాదు, చీకటికి తోడైన చీకటి యది. ప్రాకృతిక ప్రపంచశోభ సత్యసూర్యుని తేజముపై ఆధారితము. మార్గదర్శన  కారుణ్యము, జ్ఞానవిజ్ఞతలనబడు గాజుగోళమున ప్రజ్జ్వలితమైన మైనపువత్తి వంటిది; మానవహృదయ దర్పణమే ఆ జ్ఞానవిజ్ఞతల గాజుగోళము. ఆ దేదీప్యమాన దీపిక తైలము ధన్యవృక్ష ఫలము నుండి స్వీకృతమైనది; ఆ తైలము అగ్నిలేకనే వెలుగు నటుల శుద్ధీకృతమైనది. దీపిక కాంతితీవ్రతనూ, గాజుగోళపు పారదర్శకతనూ, దర్పణ నైర్మల్యమునూ సమీకృత మొనరించినప్పుడు, దీప్తికి దీప్తి చేకూరిన యట్లగును.  
సూక్ష్మముగా చెప్పవలెననిన, ఈ తొమ్మిది ఆశీఃకృత రాష్ట్రములయందునా అబ్దుల్-బహా - పర్యటించినాడు, ఒకచోటినుండి వేరొకచోటికి వెడలినాడు, దివ్యగ్రంథ జ్ఞానవ్యాఖ్యానము గావించినాడు, పరిమళ పరివ్యాపన మొనరించినాడు. రాష్ట్రములలో దివ్యసదనమును చాలవరకు నెలకొలిపి, బోధనాద్వారము దెరచినాడు. స్వచ్ఛబీజము లను ఆ రాష్ట్రములలో చల్లి, అనుగ్రహవృక్షములను నాటినాడు.
ఇక ఇప్పుడు, భగవద్విశ్వాసులును, దయామయుని సేవికలును ఈ క్షేత్రములకు నీటిని పెట్టి, ఈ దివ్యసస్యముల సేద్యమున అధికశక్తితో నిమగ్నులు కావలె. తద్వారా, బీజములు మొలిచి, ప్రవృద్ధములై, సౌభాగ్యానుగ్రహము సాకారమై, పంట దిగుబడు లెన్నియో పుష్కలముగ సమకూడవచ్చును.  
స్వచ్ఛమైన సారవంతభూమికి, స్వామి అయిన కర్షకుని వంటిది - భగవంతుని దివ్యసామ్రాజ్యము. అందున దివ్యబీజములు వేయబడతాయి, దైవేచ్ఛామేఘములు వర్షిస్తాయి, సత్యసూర్య కిరణములు ప్రసరిస్తాయి. 
ఈ అనుగ్రహములన్నియూ ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రములలోనూ నెలకొని, పరిపూర్ణముగా దృగ్గోచర మౌతాయి. దివ్యవనపాలుడు ఆ పుణ్యభూమిని జేరి, ఆ మహోదాత్త బోధనాబీజముల నాక్షేత్రమున వైచినాడు; భగవంతుని అనుగ్రహ జలధార వర్షితమైనది, సత్యసూర్యోష్ణిమ - అనగా దయాన్వితుని ఆశీస్సులు - పూర్ణతేజముతో ప్రసరింపనైనది. ఆ ధన్యజీవులయందలి ప్రతి ఒక్కరూ అప్రమేయుడైన ఏకైక జలప్రదాత కాగా, ప్రాక్పశ్చిమ అమెరికాలు మనోహర స్వర్గముగా పరివర్తన మొందవచ్చును. తద్వారా, సర్వోత్కృష్ట దేవగణమునుండి “ధన్యులు మీరు, మరియొకమారు, ధన్యులు మీరు,”3 అను ఉద్ఘోషణమును మీ రాలకింపవచ్చును.
మీకు ప్రశంసాభినందనలు. 
 
ఈ ప్రార్థన బోధకులకూ, మిత్రులకూ నిత్యపఠనీయము:
 
 
దయాన్వితుడవైన ఓ దేవదేవా! నీకు ప్రస్తుతి - మాకు మార్గదర్శన మహాపథ దర్శనము గావించి, సామ్రాజ్యద్వారములను దెరచి, సత్యసూర్యునిచే సాక్షాత్కృతుడ వైనావు. అంధులకు దృష్టినిచ్చినావు; బధిరులకు వినికిడి ననుగ్రహించినావు; నిర్జీవులను సజీవులను గావించినావు; దీనులను శ్రీమంతులను జేసినావు; పెడద్రోవ బట్టిన వారికి పథదర్శన మొనరించినావు; నోరెండిన వారిని మార్గదర్శక ప్రస్రవణము దెసకు నడిపినావు; దాహార్తి నొందిన మత్స్యమును సత్యసముద్రపు దరిజేర్చినావు; త్రిమ్మరుచున్న పక్షులను కృపయను గులాబి వనములోని కాహ్వానించినావు.
ఓ సర్వశక్తిశాలీ! మేము నీ సేవకులము నీ దీనులము; ‌ఒంటరులము - నీ సాన్నిధ్యాకాంక్షులము, నీ స్రవంతీజల దాహార్తులము, అస్వస్థులము – నీ వొన గూర్చు స్వస్థత నభిలషిస్తున్నాము. నీ పథమున పయనిస్తు న్నాము, నీ సౌరభపరివ్యాపనము దక్క మా కింకొక లక్ష్యమో, ఆశయమో లేదు; కనుక ఆత్మ లన్నియూ: “ఓ దేవా, మమ్ము సన్మార్గమునకు నిర్దేశింపు,”2 మని ఆక్రందింపవచ్చును. వెలుగును జూచుటకై వారి నేత్రములు తెరువబడు గాక; వా రజ్ఞానాంధకార విముక్తు లగుదురు గాక. వారు నీ మార్గదర్శకజ్యోతిని  పరివేష్టింతురు గాక. భాగము నొందని ప్రతి యొక్కరునూ భాగము నొందెదరు గాక. అభాగ్యులు నీ మహిమల సాన్నిహిత్యము నొందెదరు  గాక. 
ఓ సర్వశక్తిమంతుడా! వాత్సల్యదృష్టితో మమ్ము వీక్షించు, దైవానుగ్రహములను మాకు ప్రసాదించు, పవిత్రాత్మ నిశ్వాసమును మా కనుగ్రహించు, తద్వారా, మేము నీ సేవయందున  సాహాయ్యమునొంది, నీ మార్గదర్శనజ్యోతితో ఈ ప్రాంతముల యందున సముజ్జ్వలతారల వలె ప్రకాశింపవచ్చును. 
నిశ్చయముగా, నీవు శక్తిసమన్వితుడవు, శౌర్యశాలివి, విజ్ఞుడవు, సంవీక్షకుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

